# Tags
#Blog

పోటీ పరీక్షల్లో రాణించేందుకు మంచి అవకాశం

ఉచిత ఆన్లైన్ తరగతులు సద్వినియోగం చేసుకోవాలి

కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

ఎల్లారెడ్డిపేట మహాత్మా జ్యోతిబా ఫూలే ఇంటర్&డిగ్రీ కళాశాలలో అన్ అకాడమీ ఆన్ లైన్ తరగతులను కేకే మహేందర్ రెడ్డి తో కలిసి ప్రారంభించిన కలెక్టర్


అన్ అకాడమీ ద్వారా అందించే ఉచిత శిక్షణ విద్యార్థులు అన్ని జాతీయ స్థాయి పరీక్షల్లో రాణించేందుకు మంచి అవకాశమని, సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పిలుపు నిచ్చారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాయ్స్ ఇంటర్& డిగ్రీ రెసిడెన్షియల్ కళాశాలలో ఇంటర్ విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన అన్ అకాడమీ ఆన్లైన్ క్లాస్ లను శుక్రవారం కేకే మహేందర్ రెడ్డితో కలిసి కలెక్టర్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ, విద్య ద్వారానే సమాజ, వ్యక్తిగత మార్పుసాధ్యమని స్పష్టం చేశారు. ప్రభుత్వ రెసిడెన్షియల్ విద్యాలయాల్లో చదువుతున్న విద్యార్థుల కోసం ప్రభుత్వం ఉచిత ఆన్లైన్ శిక్షణ తరగతులు కొనసాగిస్తుందని తెలిపారు. ప్రతి విద్యార్థి పాఠాలు చక్కగా విని నోట్స్ రాసుకోవాలని సూచించారు. మళ్ళీ సాయంకాలం వాటిని మరోసారి చదువుకోవాలని పేర్కొన్నారు. పాఠాల్లో ఏమైనా సందేహాలు వస్తే నివృత్తి చేసుకోవాలని సూచించారు. మ్యాథ్స్, సైన్స్ ఇతర పాఠ్యాంశాల్లో వచ్చే టెస్ట్ సిరీస్ ను ప్రాక్టీస్ చేయాలని కలెక్టర్ తెలిపారు. దీంతో ఐఐటీ, జే ఈ ఈ, నీట్ తదితర జాతీయ స్థాయి పరీక్షల్లో మంచి ప్రతిభ చూపించేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.

దేశంలోని నిపుణులైన టీచర్ల చే పిల్లలకు బోధన జరుగుతుందని, ఢీల్లీ లో విద్యార్థులకు అందే శిక్షణ నేడు సాంకేతికతను వినియోగించుకుని మన జిల్లాలోని విద్యార్థులకు కూడా అందిస్తున్నామన్నారు.

ప్రతి రోజు కనీసం 2 గంటల పాటు ఆన్ లైన్ కోచ్చింగ్ తీసుకోవాలని తెలిపారు. విద్యార్థి జీవితంలో 10,11,12వ తరగతులు 3 సంవత్సరాలు చాలా కీలక సమయమని, దీనిని సద్వినియోగం చేసుకుంటే జీవితం బాగుంటుందని అన్నారు.ముఖ్యమైన పాఠ్యాంశాలలో బేసిక్స్ ఇంటర్ లో ప్రారంభం అవుతాయని అన్నారు.

కాలిక్యులస్, ఆర్గానిక్ ఫార్మింగ్, ఎలక్ట్రో మ్యాగ్నెటిసమ్ వంటి ముఖ్యమైన పాఠ్యాంశాలను కాన్సెప్ట్ పక్కాగా నేర్చుకోవాలని అన్నారు. విద్యార్థులకు ఏదైనా ఇబ్బందులు ఉంటే వెంటనే అధికారుల దృష్టికి తీసుకుని వస్తే సత్వరమే పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు.

కేకే మహేందర్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం విద్యా, వైద్య రంగాలకు పెద్దపీట వేస్తూ పేదల విద్యకై నిరంతరం కృషి చేస్తూ పెద్ద ఎత్తున పేదలకు నిధులు ఖర్చు చేస్తుందని అన్నారు. జిల్లాలో పిల్లలకు ఆన్ లైన్ తరగతుల ద్వారా ప్రవేశ పరీక్షలకు ఉచితంగా శిక్షణ అందించేందుకు కలెక్టర్ ప్రత్యేక చొరవ చూపుతున్నారని పేర్కొన్నారు. కలెక్టర్ సందీప్ కుమార్ ఝా కు అభినందనలు తెలిపారు.

కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ సాబేరా బేగం, జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం, కళాశాల ప్రిన్సిపాల్ ఉపాధ్యాయులు విద్యార్థులు, స్థానిక నాయకులు, తదితరులు పాల్గొన్నారు.