# Tags
#తెలంగాణ

రైతును రాజు చేయాలన్నదే ముఖ్యమంత్రి సంకల్పం: ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

రాజన్న సిరిసిల్ల జిల్లా,(తెలంగాణ రిపోర్టర్)
కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమ ప్రభుత్వమని, రైతును రాజు చేయాలన్నదే రాష్ట్ర ముఖ్యమంత్రి సంకల్పమని ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ అన్నారు.

గురువారం కోనరావుపేట మండలం మామిడిపెల్లి గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని, నిజామాబాద్ గ్రామంలో ప్యాక్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ తో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతూ దళారీ వ్యవస్థకు స్వస్తి పలికి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని గుర్తు చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో కొనుగోలు కేంద్రాల నిర్వహణను మహిళా సంఘాలకు అప్పజెప్పడం జరిగిందని పేర్కొన్నారు. రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని రైతులకు ఉచిత విద్యుత్ పంపిణీ ఫైల్ పై తొలి సంతకం చేయడం జరిగిందన్నారు. గత ప్రభుత్వ హయాంలో కొనుగోళ్ళు ఆలస్యమయ్యాయని, దీని వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కున్నారని ఆరోపించారు. ప్రస్తుతం సమయానికి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం జరిగిందని, క్షేత్ర స్థాయిలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు.

రైతులకు మేలు కలిగే కార్యక్రమాలు రాబోయే రోజుల్లో చేపడుతామని అన్నారు. రైతు భరోసా త్వరలోనే ఇస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటన చేశారని గుర్తు చేశారు. రుణమాఫీ లో భాగంగా సుమారు 18 వేల కోట్ల రూపాయలను 22 లక్షల మంది ఖాతాల్లోకి జమ చేశామని తెలిపారు. సాంకేతిక సమస్య వల్ల కొందరు రైతుల ఖాతాల్లో జమ కాలేదని, అవి జమ చేయడానికి వ్యవసాయ శాఖ, బ్యాంకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. రేషన్ కార్డులు లేని వారిని గుర్తించి వారికి 31 వేల కోట్ల ద్వారా రుణమాఫీ వర్తింపజేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ప్రస్తావించారు.

రైతుల సంక్షేమం కోసం ఆనాడు రాజశేఖర్ రెడ్డి అహర్నిశలు శ్రమించేవాడని, అదే స్పూర్తితో ప్రస్తుతం రేవంత్ రెడ్డి రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వ పరంగా అనేక కార్యక్రమాలు చేపడుతున్నారని అన్నారు. రాష్ట్రంలో ప్రాధాన్యత క్రమంలో పెట్టిన 9 ప్రాజెక్టుల్లో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు ఉందని, మన ప్రాంతంలో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా మరింత సస్యశ్యామలం అవుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు. మల్కపేట రిజర్వాయర్ లో నీటిని నింపి కోనరావుపేట మండలంలోని సుమారు 7 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తామని పేర్కొన్నారు.

17 శాతం తేమ వచ్చాక ధాన్యం తూకం వేయడం జరుగుతుందని, కొనుగోలు కేంద్రాల్లో రైతులకు అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరుగుతుందిని స్పష్టం చేశారు. కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని, ధాన్యం అమ్మిన తర్వాత రెండు రోజుల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయని అన్నారు..