మావోయిస్టు పార్టీ చరిత్రలో సరికొత్త సంచలనం చోటుచేసుకుంది.

సీపీఐ (మావోయిస్ట్) పొలిట్ బ్యూరో మెంబర్ మల్లోజుల వేణుగోపాల్ రావు అలియాస్ అభయ్ అలియాస్ సోను ఇవాళ మహారాష్ట్రలోని గడ్చిరోలి లో ఆయుధాలను వదిలిపెట్టి పోలీసుల ఎదుట లోంగిపోయినట్లుగా సమాచారం.
ఆయనతో పాటు మరో 60 మంది మావోయిస్టు పార్టీ సభ్యులు కూడా అస్త్ర సన్యాసం చేసినట్లుగా తెలుస్తోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశాల మేరకు దేశ వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో పోలీసులు, భద్రతా బలగాలు నిర్వహిస్తున్న ‘ఆపరేషన్ కగార్’ ఇప్పటికే తీవ్ర రూపం దాల్చింది.
వరుస ఎన్కౌంటర్లలో వందల కొద్దీ మావోయిస్టులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల మల్లోజుల వేణుగోపాల్ రావు అలియాస్ అభయ్ తాము ఆయుధాలు వదిలి పెట్టేందుకు సిద్ధమని ప్రతికా ప్రకటన చేశారు. ఆయన నిర్ణయానికి ఛత్తీస్గఢ్తో సహా దేశంలోని ఇతర మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోని కేడర్లు కూడా మద్దతు తెలిపాయి. దీంతో ఇవాళ మల్లోజుల వేణుగోపాల్ రావు మహారాష్ట్రలోని గడ్చిరోలిలో పోలీసుల ఎదుట ఆయుధాలను వదిలేసి లొంగిపోయారు.
ఎన్కౌంటర్లో అన్నను కోల్పోయి..
మల్లోజుల వేణుగోపాల్ తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లా పెద్దపల్లిలో నిరుపేద కుటుంబంలో జన్మించారు. అన్న మల్లోజుల కోటేశ్వర రావు (కిషన్జీ)ను విప్లవ స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని మావోయిస్టు పార్టీలో చేరి అత్యంత కీలక వ్యవహరించారు. 2011 నవంబరు 24న బెంగాల్లో జరిగిన ఎన్కౌంటర్లో అన్న మల్లోజుల కోటేశ్వర రావు అలియాస్ కిషన్జీ మృతి చెందారు. తదనంతర పరిణామాల నేపథ్యంలో మావోయిస్ట్ కమాండర్ అయిన మల్లోజుల వేణుగోపాల్ భార్య తారా కూడా మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఎదుట లొంగిపోయారు. ఆమె గడ్చిరోలి రీజియన్లో మోస్ట్ వాంటెడ్ నక్సల్స్ లిస్టులో కూడా ఉన్నారు.
పార్టీలో మల్లోజుల ప్రస్థానం….
కామ్రేడ్ మల్లోజుల వేణుగోపాల్ పూర్వ పీపుల్స్వార్ గ్రూపులో భూపతి, సోనూ, మాస్టర్, అభయ్ వంటి పేర్లతో పని చేశారు. అదేవిధంగా మావోయిస్టు పార్టీలో చేరాక మహారాష్ట్రలోని గడ్చిరోలి ప్రాంతంలో దండకారణ్య ప్రత్యేక జోనల్ కమిటీకి అధిపతిగా ఉన్నారు. దక్షిణ భారత దేశంలోని పశ్చిమ కనుమలకు రెండు వైపులా, కేరళలోని గోవా నుంచి ఇడుక్కి వరకు ఉన్న గెరిల్లా జోన్ను నెలకొల్పడంలో కీలక పాత్ర పోషించారు.
పార్టీలో చెరుకూరి రాజ్కుమార్ (ఆజాద్) మరణం తరువాత ఆయన సీపీఐ (మావోయిస్టు) పార్టీకి అధికార ప్రతినిధిగా నియమితులయ్యారు. అతను పార్టీలో ప్రచురణల విభాగంలో నిర్వహణ బాధ్యతలను స్వీకరించారు.
ఏప్రిల్ 2010 దంతెవాడ ఘటనలో 76 మంది సెంట్రల్ రిజర్వ్ పోలీసు ఫోర్సు కు చెందిన పోలీసుల మరణానికి వెనుక మల్లోజుల హస్తం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు అనుమానిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్ పోలీసులు మల్లోజులపై భారీ ఎత్తున రివార్డులు ప్రకటించారు.
మల్లోజుల కోటేశ్వర రావు అలియాస్ కిషన్జీ మరణం తరువాత వేణుగోపాల్ రావు పశ్చిమ బెంగాల్లో ఆపరేషన్ గ్రీన్ హంట్కు వ్యతిరేకంగా జరిగిన ‘లాల్గర్’ ఉద్యమానికి నాయకుడిగా నియమితులయ్యారు.
Sircilla Srinivas is a Senior Journalist with 35+ years of experience in Professional Journalism from United Karimnagar and Jagityal Dist, Telangana. Awardee of TS Govt Haritha Haram 2017 State cash Award. Participating in social activities such as Assistant Governor of Rotary Club Dist.3150, Dist committee member of Indian Red Cross society.





