# Tags
#తెలంగాణ

జిల్లా స్థాయిలో ఎంపికైన ఉపాధ్యాయులకు సన్మానం

ఉపాధ్యాయులు మంచి నాణ్యతతో కూడిన విద్యను అందించాలి:ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్

ఉపాధ్యాయులు అంకిత భావంతో పనిచేస్తూ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేలా అహర్నిశలు కృషి చేయాలని ప్రభుత్వ విప్, ధర్మపురి శాసన సభ్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

గురువారం సాయంత్రం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా జిల్లా స్థాయిలో ఎంపికైన ఉపాధ్యాయులను సన్మానించి, శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విద్యార్థులను క్రమ శిక్షణతో పాటు బాధ్యత కలిగిన పౌరులుగా తీర్చి దిద్దే బాధ్యత తమపై ఉందని పేర్కొన్నారు. అదే విధంగా విద్యార్థులకు అభిరుచి కలిగిన సబ్జెక్టులపై ఉపాధ్యాయులు తర్ఫీదునిఛ్చి వారి ఉజ్వల భవిష్యత్తుకు తోడ్పడాలని కోరారు.

మంచి నైతిక విలువలు విద్యార్థుల్లో పెంపొందించాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీ కృష్ణ, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, అదనపు కలెక్టర్ పి. రాంబాబు, డీసీఎంఎస్ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ అడువాల జ్యోతి, జిల్లా విద్యాధికారి జగన్ మోహన్ రెడ్డి, వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు, మండల విద్యాధికారులు, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.