# Tags

పశువులను నీటి ప్రవాహ ప్రదేశాలకు తీసుకువెళ్లవద్దు : జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

వరద ప్రవాహానికి దెబ్బతిన్న రహదారుల మరమ్మతుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలి..

గంభీరావుపేట మండలంలోని భారీ వర్షాలు, వరద ప్రవాహంతో దెబ్బతిన్న రోడ్లు, మిషన్ భగీరథ పైపులైన్లు, విద్యుత్ లైన్ ల పరిశీలన…


గంభీరావుపేట,

భారీ వర్షాల నేపథ్యంలో మానేరు ప్రవహించే గ్రామాల రైతులు, పశువుల యజమానులు మూగజీవాలను నీరు పారే ప్రాంతాలకు తీసుకువెళ్ళవద్దని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సూచించారు.

ఇటీవల భారీ వర్షాలు, వరదల ప్రవాహంతో గంభీరావుపేట మండలంలో దెబ్బతిన్న రోడ్లు, మిషన్ భగీరథ పైపులైన్లు, విద్యుత్ పరికరాలను కలెక్టర్ మంగళవారం పరిశీలించారు.

నర్మాల నుంచి లింగన్నపేట వెళ్లే రహదారి మొత్తం వరదలకు పాడైంది. రహదారులు, మిషన్ భగీరథ పైప్ లైన్లు, విద్యుత్ పరికరాలకు వెంటనే మరమ్మతు చేయించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని, పనులు వేగంగా పూర్తి చేసి నీటి, విద్యుత్ లైన్ లను పునరుద్ధరించాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు.

అనంతరం కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడారు. వర్షాలు తగ్గే వరకూ పశువుల కాపరులు నీటి ప్రవాహం ప్రదేశాలకు జీవాలను తీసుకువెళ్ళవద్దని సూచించారు. రైతులు, ప్రజలు, మత్స్యకారులు వరద ప్రవాహాల వద్దకు వెళ్లకూడదని పేర్కొన్నారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆదేశించారు.

గంభీరావుపేట మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ కొమిరిశెట్టి విజయ, సిరిసిల్ల ఆర్డీవో వెంకటేశ్వర్లు, తహసిల్దార్, ఎంపీడీఓ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.