# Tags

లైఫ్ సైన్సెస్ లో 5 లక్షల మందికి ఉపాధి – 2030 నాటికి రూ.లక్ష కోట్ల పెట్టుబడులు : మంత్రి శ్రీధర్ బాబు

ఆస్ట్రేలియా :మెల్బోర్న్ :

👉 మెల్బోర్న్ లో “ఆస్ బయోటెక్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ లో మంత్రి శ్రీధర్ బాబు కీలక ఒప్పందాలు:

హైదరాబాద్: 

లైఫ్ సైన్సెస్ లో 2030 నాటికి కొత్తగా రూ.లక్ష కోట్ల పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకొచ్చి… 5 లక్షల మందికి ఉపాధి కల్పించేలా దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందిస్తున్నట్లుగా తెలంగాణ రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. 

ఆస్ట్రేలియా లైఫ్ సైన్సెస్ అత్యున్నత నిర్ణాయక సంస్థ ‘ఆస్ బయోటెక్’, విక్టోరియా రాష్ట్ర ప్రభుత్వం సంయుక్త నిర్వహణలో మెల్ బోర్న్ లో నిర్వహిస్తున్న ఆస్ బయోటెక్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్- 2025లో ఆయన గురువారం కీలకోపన్యాసం చేశారు. 

రెండేళ్లలో తెలంగాణ లైఫ్ సైన్సెస్ రంగం సాధించిన పురోగతి, భవిష్యత్తు ప్రణాళికలు, అవకాశాలు, ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అనుకూలతలను ఈ సందర్భంగా ఆయన వివరించారు. తెలంగాణను గ్లోబల్ లైఫ్ సైన్సెస్ హబ్ గా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరపున తీసుకుంటున్న చర్యలను వెల్లడించారు.

మా నినాదం “మేడిన్ ఇండియా కాదు… ఇన్వెంట్ ఇన్ తెలం గాణ” అని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. లైఫ్ సైన్సెస్ పరిశ్రమల ఏర్పాటుకు అనువైన ఎకో సిస్టం తెలంగాణ బ్రాండ్ ను విశ్వవ్యాప్తం చేస్తుందన్నారు.

2030 నాటికి 250 బిలియన్ డాలర్లకు…..

భౌగోళికంగా 11వ స్థానం, జనాభాలో 12వ స్థానంలో ఉన్నప్పటికీ, దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో తెలంగాణ వాటా 5 శాతం కంటే ఎక్కువగా ఉందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. 2024-20 25లో తెలంగాణ జీ ఎస్ డి పి వృద్ధి రేటు 8.2 శాతం కాగా, జాతీయ సగటు కేవలం 7.6 శాతం ఉందన్నారు.

గత 20 నెలల కాలంలో కొత్తగా రూ.3.2 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి రాగా, ఇందులో లైఫ్ సైన్సెస్ రంగం వాటా రూ.63వేల కోట్లు అని చెప్పారు. లైఫ్ సైన్సెస్ ఎగుమతులు గతేడాది ఏప్రిల్-డిసెంబర్ మధ్య కాలంలోనే రూ.26వేల కోట్ల మార్కును దాటాయన్నా రు. 

తెలంగాణ లైఫ్ సైన్సెస్ రంగం ఆర్థిక వ్యవస్థ విలువను ప్రస్తుతం ఉన్న 80 బిలియన్ డాలర్ల నుంచి 2030 నాటికి 250 బిలియన్ డాలర్లకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. 

ప్రపంచంలోని అత్యుత్తమ లైఫ్ సైన్సెస్ క్లస్టర్లలో హైదరాబాద్ కు చోటు….

ప్రముఖ కన్సల్టింగ్ సంస్థ సీబీఆర్ రూపొందించిన గ్లోబల్ లైఫ్ సైన్సెస్ అట్లాస్ లో ప్రపంచంలోని అత్యుత్తమ లైఫ్ సైన్సెస్ క్లస్టర్లలో హైదరాబాద్ కు చోటు దక్కిందన్నారు. 

బోస్టన్, శాన్ ఫ్రాన్సిస్కో, కేంబ్రిడ్జ్, బీజింగ్, టోక్యో సరసన మన నగరం నిలిచిందన్నారు. ఈ జాబితాలో భారత్ నుంచి చోటు దక్కించుకున్న ఏకైక నగరం హైదరాబాద్ మాత్రమే అని అన్నారు. 

జీనోమ్ వ్యాలీ, మెడికల్ డివైసెస్ పార్క్, బీహబ్, భారత్ ఫ్యూచర్ సిటీ, పారిశ్రామికాభివృద్ధిని ప్రోత్సహించే ప్రగతిశీల, ప్రోత్సాహకర విధానాలు, ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు, ప్లగ్-అండ్-ప్లే పారిశ్రామిక పార్కులు, అనుమతుల కోసం సింగిల్ విండో సిస్టమ్, దేశంలోనే సాటి లేని స్టెమ్ టాలెంట్, స్థిరమైన ప్రభుత్వం, సమర్థవంతమైన నాయకత్వం, ఎక్కడైనా సులభంగా చేరుకునేలా రవాణా సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయన్నారు. 

బయో ఏషియా సదస్సుకు ఆహ్వానం

రాబోయే ఫిబ్రవరిలో హైదరాబాద్ లో నిర్వహించనున్న బయో ఏషియా సదస్సుకు హాజరు కావాలని దిగ్గజ లైఫ్ సైన్సెస్ పరిశ్రమలను ఆహ్వానించారు. 

ఈ సదస్సులో విక్టోరియా రాష్ట్ర మంత్రులు రోస్ స్పెన్స్, డానీ పియర్సన్ ఎంపీ, ఆస్ బయోటెక్ ఛైర్మన్ డా. జేమ్స్ క్యాంప్బెల్, తెలంగాణ ఇన్వెస్ట్మెంట్ సెల్ డైరెక్టర్ మధుసూదన్, తెలంగాణ లైఫ్ సైన్సెస్ ఫౌండేషన్ సీఈవో శక్తి నాగప్పన్ తదితరులు పాల్గొన్నారు.