# Tags

హరిత ఇంధన ఉత్పత్తి పర్యావరణ హితం : జగిత్యాల ఎన్పీడీసీఎల్ ఎస్ఈ బి.సుదర్శనం

మెటుపల్లి:

మానవాళి మనుగడకు భూగ్రహంపై ఉష్ణ తాపం తగ్గించడానికి, కర్బన ఉద్గారాలు నివారించి బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి స్థానంలో పర్యావరణ హితమైన సోలార్ ఇంధన ఉత్పత్తి వైపు విద్యుత్ వినియోగదారులు దృష్టి పెట్టాలని జగిత్యాల ఎన్పీడీసీఎల్ ఎస్ఈ బి.సుదర్శనం ఉద్బోధించారు.

మెటుపల్లి లో సోలార్ ఇంధన వనరుల ఆవశ్యకతపై నిర్వహించిన అవగాహనా సదస్సులో మాట్లాడుతూ, ప్రస్తుత విద్యుత్ అవసరాలకు దేశంలో థర్మల్ స్టేషన్ ల ద్వారా సింహభాగం ఉత్పత్తి జరుగుతోందని, బొగ్గు మండించడం వల్ల వాతావరణ సమతుల్యత దెబ్బతినడమే కాకుండా, మనుషులకు శ్వాసకోశ వ్యాధులు, ధూళి, పొగ వల్ల దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఏర్పడి ఆసుపత్రుల పాలు కావాల్సి వస్తోందని తెలిపారు.

ఈ సమస్యలకు ప్రత్యామ్నాయంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం-సూర్య ఘర్ యోజన, పీఎం-కుసుమ్ తదితర పథకాలు ప్రవేశ పెట్టి కోట్లాది రూపాయలు సబ్సిడీల పేరిట అందించి హరిత ఇంధన ఉత్పత్తిని ప్రోత్సాహిస్తున్నాయని వాటిని అందిపుచ్చుకోవాలని సూచించారు. పౌరులుగా సమాజ హితం పట్ల మనందరికీ బాధ్యత ఉండాలని గుర్తు చేశారు.

ఈ సందర్భంగా సోలార్ పలకల ఉత్పత్తి దారులు వినియోగదారులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చి, కిలోవాట్ ఒక్కంటికి అయ్యే ఖర్చు, నిర్వహణ, గ్యారంటీ తదితర సందేహాలను నివృత్తి చేశారు.

ఈ కార్యక్రమంలో మెటుపల్లి డీఈ మధుసూదన్, ఏడీఈ మనోహర్, పరిశ్రమల యజమానులు గుంటుక విష్ణు, మైలారం లింబాద్రి, రాజేందర్, పౌల్ట్రీ పరిశ్రమ అధ్యక్షులు రవీందర్ రెడ్డి, సోలార్ కంపెనీ ప్రతినిధులు బండి ప్రవీణ్,
వెల్డింగ్ అసోసియేషన్ అధ్యక్షులు సలీం, వ్యాపారవేత్తలు పండిత్, ప్రతాప్ రెడ్డి, నర్సారెడ్డి, భాస్కర్ రెడ్డి, ఏఈలు అమరేందర్, రవి, అజయ్, శివకుమార్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.