ప్రమాదకర విద్యుత్ నెట్వర్క్ సరిదిద్దడానికి సామూహిక ప్రక్రియకు ఎన్పీడీసీఎల్ శ్రీకారం
జగిత్యాల జిల్లా :
- * విద్యుత్ ప్రమాదాల సమూల నిర్మూలనే లక్ష్యం
- ** ప్రతీ సెక్షన్లో కనీసం రోజుకు రెండు చోట్ల సరిదిద్దాలి – కదిలిన విద్యుత్ యంత్రాంగం
రోజురోజుకూ పెరుగుతున్న విద్యుత్ ప్రమాదాలను సమూలంగా నిర్మూలించడానికి, ఏళ్ల తరబడి మిగిలిపోయిన, పాతబడిపోయి దుర్భరంగా, ప్రమాదకరంగా ఉన్న నెట్వర్క్ ను సరిదిద్దే ప్రక్రియకు ఎన్పీడీసీఎల్ యంత్రాంగం కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసింది.

అందుకు అనుగుణంగా ప్రతి సెక్షన్లో కనీసం రోజుకు రెండు చొప్పున ప్రమాదాలకు అవకాశం ఉన్న స్థలాలను కనుగొని వాటిని సరిదిద్ధి ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని ఎన్పీడీసీఎల్ సీఎండి కర్నాటి వరుణ్ రెడ్డి క్షేత్రస్థాయి ఇంజనీర్లు మరియు సిబ్బందికి లక్ష్యాన్ని నిర్దేశించారు. మనుషుల ప్రాణాలు చాలా విలువైనవని, భవిష్యత్తులో ఒక్క ప్రాణం కూడా అస్తవ్యస్తమైన నెట్వర్క్ వల్ల పోవడానికి వీలులేదని, అలా జరిగితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తూ ఆదేశాలు జారీ చేశారు.

12 ముఖ్యమైన సమస్యలు :
- ప్రమాదాలకు కారణాలుగా భావిస్తున్న ముఖ్యమైన పారామితులు (వల్నరబుల్ లొకేషన్లు) ఇవీ…
అస్తవ్యస్తంగా ఉన్న ట్రాన్స్ఫార్మర్ స్ట్రక్చర్లు, తుప్పు పట్టి పాడైపోయిన ఎర్తు పైపులు, వంగిపోయిన స్తంభాలు, వదులుగా వేలాడుతున్న తీగలు, రెండు స్తంభాల మధ్య డెబ్బై మీటర్ల కంటే ఎక్కువ నిడివి ఉన్న వాటి నడుమ మద్యంతర స్తంభాలు, సిమెంటు ఊడిపోయి ఇనుప రాడ్లు తేలిన స్తంభాలు, ఇరువైపుల నుండి విద్యుత్ సరఫరా కలిగియున్న ఫీడర్ల యొక్క డబల్ ఫీడింగ్ పాయింట్ల వద్ద ఒక స్పాన్ లో విద్యుత్ నిర్వీర్యం చేయడం, ఒకే స్తంభం పై ప్రయాణిస్తున్న హెచ్టి-ఎల్టీ లైన్ల మధ్య దూరం కనీసం ఐదు అడుగులు ఉండేలా చూడడం, ఇళ్లకు దగ్గరగా, ఇండ్ల మీదుగా వెళ్లే లైన్లను కనీస దూరానికి మార్చి మనుషులు షాక్ కు గురికాకుండా చూడడం, పంచాయతీరాజ్, ఆర్ అండ్ బి, జాతీయ రహదారుల వెంట లైన్లు క్రాస్ అయినప్పుడు భూమి నుండి ప్రామాణిక ఎత్తును పాటించడం, ఎత్తు తక్కువగా ఉన్న ట్రాన్స్ఫార్మర్ల గద్దెలను పెంచడం, సిబ్బంది స్వయం రక్షణ జాగ్రత్తలు తీసుకోవడం.. ఇలా 12 ముఖ్యమైన సమస్యలుగా గుర్తించారు.

- నడుం బిగించిన యంత్రాంగం :
గత రెండు మూడు రోజుల నుండి డివిజన్ వ్యాప్తంగా ప్రతి సెక్షన్లో స్థానిక క్షేత్ర స్థాయి సిబ్బంది తాము గుర్తించిన సమస్యలను ఆన్లైన్లో నమోదు చేసి వాటిని సరిదిద్దే పనికి ఉపక్రమించారు. చిన్న పనులు సిబ్బంది నిర్వహిస్తూ, పెద్దవాటిని కాంట్రాక్టర్ల ద్వారా చేపిస్తూ రోజువారీగా అప్లోడ్ చేస్తున్నారు. ఈ సెక్షన్లో ప్రతిరోజు ఏ పని జరుగుతున్నది అన్న విషయం ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ పనులు వేగవంతం చేయడానికి యాజమాన్యం దిశా నిర్దేశం చేస్తున్నది.
- ఈ పనుల వల్ల చేకూరే ప్రయోజనాలు :
ఏళ్ళ తరబడి పేరుకుపోయిన పాత నెట్వర్క్ ను సరిదిద్దడం వల్ల విద్యుత్ ప్రమాదాలనుండి మనుషులను, మూగజీవాలను రక్షించవచ్చు. ముఖ్యంగా విద్యుత్ సంస్థ పట్ల వినియోగదారుల్లో ఒక మంచి నమ్మకం ఏర్పడుతుంది. సంస్థ పేరు ఇనుమడిస్తుంది. జాతీయ స్థాయిలో డిస్కంల పనితీరు మెరుగు పడటం వల్ల పరపతి రేటింగ్ పెరిగి ప్రభుత్వాలు, వివిధ ఆర్థిక సంస్థల ద్వారా ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది. అంతిమంగా వినియోగదారులే లబ్ది పొందుతారు.
- పొలం బాట :

క్షేత్రస్థాయిలో సమస్యలను తెలుసుకోవడానికి నేరుగా రైతుల వద్దకే వెళ్ళి మాట్లాడి తక్షణం పరిష్కరించడానికి ప్రతీ వారం ఒక రోజు పొలం బాట కార్యక్రమం రూపొందించబడింది. అధికారులు, సిబ్బంది, కార్మికులు గుర్తించబడిన ప్రమాదాలకు ఆస్కారం ఉన్న లైన్ లను సరిదిద్దడం వల్ల వినియోగదారులు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ట్రాన్స్ఫార్మర్ ఓవర్ లోడ్ సమస్యలు, సామర్థ్యం పెంపుదల, అదనపు ట్రాన్స్ఫార్మర్ల మంజూరు, కొత్త కనెక్షన్ల విడుదలలో వేగం, రైతులు విద్యుత్ సిబ్బంది కి సమాచారం లేకుండా, స్వయంగా ట్రాన్స్ఫార్మర్లపై ఫ్యూజ్ లు మార్చే ప్రక్రియలో విద్యుత్ ప్రమాదాల బారిన పడకుండా అప్రమత్తం చేయడం, ఆ పనులకు ఖచ్చితంగా స్థానిక సిబ్బందికి సమాచారం ఇవ్వడం మొదలగు జాగ్రత్తలు, విషయాలు రైతుల దృష్టికి తేవడం జరుగుతుంది. ఈ పొలం బాట మంచి సత్ఫలితాలను ఇస్తుందనడంలో సందేహం లేదు.
- ఇది నిరంతర ప్రక్రియ: జి.మధుసూదన్, డిఈ, మెట్టుపల్లి :

విద్యుత్ యాజమాన్యం ఆదేశాల ప్రకారం క్షేత్రస్థాయిలో సిబ్బందిని కార్యోన్ముఖులను చేస్తూ ప్రమాదాల నివారణకు అన్ని చర్యలు తీసుకుంటున్నాము, ఇది నిరంతర ప్రక్రియ గా కొనసాగిస్థాం. స్వయం రక్షణ జాగ్రత్తలు తీసుకోకుండా పని చేసే సిబ్బందిని గుర్తించి వారి జీతం నుండి రూ.3 వేలు కోత విధిస్తున్నాం.
- గొప్ప భవిష్యత్తుకు పునాది: దురిశెట్టి మనోహర్, ఏడీఈ, మెటుపల్లి :

ప్రతీ గ్రామంలో చేపడుతున్న ప్రమాదకర నెట్వర్క్ ను సరిదిద్దె ప్రక్రియ ఒక మంచి పరిణామం. రాబోయే కాలంలో విద్యుత్ ప్రమాదాలను జీరో స్థాయికి తగ్గించాలనేదే మా లక్ష్యం. అందుకు సిబ్బంది సమర్థవంతంగా సేవలు అందిస్తున్నారు. ఈ పనుల ద్వారా వినియోగదారులు, రైతుల అభిమానం చూరగొంటాం.
Sircilla Srinivas is a Senior Journalist with 35+ years of experience in Professional Journalism from United Karimnagar and Jagityal Dist, Telangana. Awardee of TS Govt Haritha Haram 2017 State cash Award. Participating in social activities such as Assistant Governor of Rotary Club Dist.3150, Dist committee member of Indian Red Cross society.