# Tags
#Nature #People #Review #Tech #జగిత్యాల #తెలంగాణ

ఎండదెబ్బ తగలకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి:జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా

జగిత్యాల

ఎండదెబ్బ తగలకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి-వేసవికాలంలో జాగ్రత్తలుపాటిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి:జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా

ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్న ప్రస్తుత పరిస్థితులలో,ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ఎండ దెబ్బ తగలకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ శ్రీమతి షేక్ యాస్మిన్ బాషా కోరారు.

మంగళ వారం మధ్యాహ్నం 3-30 గంటల ప్రాంతంలో జగిత్యాల జిల్లా కేంద్రంలోని మోతే వాడ, తిప్పన్న పేట, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను జిల్లా కలెక్టర్ శ్రీమతి షేక్ యాస్మిన్ బాషా సందర్శించారు. ఆయా ఆరోగ్య కేంద్రాలను పరిశీలించిన అనంతరం ఎండ దెబ్బ తగిలితే తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించే పోస్టర్ ను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా కలెక్టర్  యాస్మిన్ బాషా మాట్లాడుతూ…  ఎండదెబ్బ తగలకుండా జాగ్రత్తలు పాటించాలని, ఎండల్లో బయట తిరగకుండా జాగ్రత్త వహించాలని, అత్యవసర పరిస్థితి అయితే తప్ప  బయటికి రాకూడదని ప్రజలను కోరారు. మద్యాహ్నం 12  గంటల నుండి 4 గంటల మద్యలో ఎట్టి పరిస్థితులలో ఇండ్ల నుంచి బయటకు రావొద్దని ప్రజలకు సూచించారు.

ఎండాకాలంలో నిలిపి ఉన్న వాహనాలలో పిల్లలు, పెంపుడు జంతువులను వదలవద్దని, మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు వంట నివారించాలని, ఎండలలో పనిచేయవద్దని కోరారు. ఆల్కహాల్ ,టీ, కాఫీ, స్వీట్స్ చల్లని డ్రింక్స్ తీసుకోవద్దని , చెప్పులు లేకుండా బయట నడవవద్దని  అన్నారు.

అలాగే చిన్నారులు, వయోవృద్దులు ఇంటికే పరిమితం కావాలని, ప్రతి రోజు సరిపడా నీరు తీసుకోవాలని సూచించారు. వదులుగా ఉన్న దుస్తువులను ధరించాలని, బయటికి వెళ్ళేటప్పడు గొడుగు లేదా టోపిని దరించాలని, ద్వి చక్రవాహనాల పై సుదూర ప్రయాణాలు చేయకూడదని కోరారు. సూర్యుని కిరణాలు శరీరంపై పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు.

అలాగే ఎండలో పనిచేసే కార్మికులు తరచుగా నీటీతో పాటు ఓ.ఆర్.ఎస్. ద్రావణాన్ని తీసుకోవాలని తద్వారా వడదెబ్బ నుండి శరీరాన్ని కాపాడు కోవచ్చన్నారు. చర్మం పై ఎర్రటి దద్దుర్లు, చర్మం పొడిబారడం లాంటివి చర్మం పై వస్తున్న మార్పులను గమనించాలని, అధిక శరీర  ఉష్ణోగ్రత, అలసట, నోరు ఎండి పోవడం, తలనొప్పి, ఒళ్లు నొప్పులు, వాంతులు, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తే  సమీప ప్రభుత్వ ఆసుపత్రులలో సంప్రదించి లేదా 108 కు ఫోన్ చేసి చికిత్స, అవసరమైన మందులు పొందాలని, అందుబాటులో ఉన్నాయని అన్నారు. 

ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకొని ఈ వేసవి కాలంలో జాగ్రత్తలు పాటిస్తూ, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కలెక్టర్ కోరారు.  

ఈ కార్యక్రమంలో  జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డా.పుప్పాల శ్రీధర్, సంబంధిత అధికారులు, తహసిల్దార్ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.