#తెలంగాణ #People #world

రాజ్యాంగ స్పూర్తితో ప్రజల సంక్షేమమే ఎజెండాగా ప్రజా ప్రభుత్వ పాలన: రాష్ట్ర మంత్రి డి.శ్రీధర్ బాబు

  • 101 కోట్ల 90 లక్షల రూపాయల రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి శ్రీధర్ బాబు
  • రోడ్డు నిర్మాణ పనులను నాణ్యతతో పూర్తి చేయాలి
  • మంథని పట్టణంలో ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి కోటి రూపాయలు మంజూరు

మంథని, ఏప్రిల్-14:

భారతరత్న డా బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని, సోమవారం మంథని పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి మంత్రి శ్రీధర్ బాబు, జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పూలమాలలు వేసి నివాళులర్పించారు.

రాజ్యాంగ స్పూర్తితో ప్రజల సంక్షేమమే ఎజెండాగా ప్రజా ప్రభుత్వ పాలన సాగిస్తుందని రాష్ట్ర ఐటి, పరిశ్రమలు శాసన సభ వ్యవహారాల శాఖా మాత్యులు డి.శ్రీధర్ బాబు అన్నారు.

సోమవారం రాష్ట్ర ఐటి, పరిశ్రమలు శాసన సభ వ్యవహారాల శాఖా మంత్రి డి.శ్రీధర్ బాబు, మంథని లో పలు గ్రామాలకు రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి రోజున పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉందని అన్నారు. భారత రత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆలోచన విధానం మేరకు పేదల సంక్షేమమే ప్రధాన అజెండాగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు.

ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారతదేశం ఆవిర్భవించడంలో బీఆర్ అంబేద్కర్ కీలక పాత్ర పోషించారని అన్నారు. అట్టడుగు వర్గాలలో జన్మించి ప్రపంచ మేధావిగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఎదిగారని, స్వాతంత్రం వచ్చిన తరువాత మన దేశానికి రాజ్యాంగం రచించడంలో కీలకపాత్ర పోషించారని అన్నారు.

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో మన రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం పాలన సాగిస్తుందని అన్నారు. రాజ్యాంగ స్ఫూర్తి కాపాడాలని, అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరగాలని తమ పార్టీ, ప్రభుత్వం విధానంగా పని చేస్తుందని అన్నారు. సమగ్ర వర్గాల అభివృద్ధి ధ్యేయంగా, అందర్నీ కలిపి మందుకు తీసుకువెళ్లాలని ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు.

దశాబ్దాల కాలంగా పెండింగ్ ఉన్న ఎస్సీ వర్గీకరణ అంశం తమ ప్రభుత్వం పూర్తి చేసిందని తెలిపారు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నామని అన్నారు. ఉమ్మడి రాష్ట్ర పాలనలో మొట్టమొదటిసారిగా రాజ్యాంగ స్పూర్తితో ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ ప్రవేశ పెట్టామని అన్నారు.

దళిత వర్గాలకే కాకుండా బడుగు బలహీన వర్గాలకు పేదలకు సమన్యాయం జరగాలని ఆలోచించిన వ్యక్తి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అని, ఆయన స్ఫూర్తి ప్రజలలోకి తీసుకుని వెళ్లే విధంగా మన నాయకుడు పోరాటం చేస్తున్నారని మంత్రి గుర్తు చేశారు.

  • 101 కోట్ల 90 లక్షల రూపాయల రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన :

మంథని పట్టణం పరిసర ప్రాంతాల్లో రోడ్డు నిర్మాణ పనులకు నిధులు మంజూరు చేయించామని అన్నారు. ఎక్లాస్ పూర్ నుంచి ఖమ్మం పల్లి రహదారి పునరుద్ధరణ పనులను 11 కోట్ల 90 లక్షలతో, ఖమ్మం పల్లి నుంచి ఓడేడు వరకు 15 కిలోమీటర్ల బీటీ రోడ్డు నిర్మాణ పనులను 30 కోట్లతో, మంథని నుంచి ఓడెడు వరకు 19 కిలో మీటర్ల బీటీ రోడ్డు నిర్మాణ పనులను 60 కోట్లతో చేపట్టడం జరిగిందని అన్నారు.

ట్రాఫిక్ సమస్య పరిష్కారం, సులభంగా వాహన మూమెంట్ ఉండేలా రోడ్డు నిర్మాణ పనులు చేపట్టామని అన్నారు. రోడ్డు నిర్మాణ పనులు మంజూరు చేసిన సీఎం రేవంత్ రెడ్డి, రోడ్లు భవనాల శాఖ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి లకు మంత్రి శ్రీధర్ బాబు కృతజ్ఞతలు తెలిపారు.

పగుళ్ల గుట్టలో దేవాలయ దర్శనానికి అనేక ప్రాంతాల నుంచి భక్తులు వస్తున్నారని, వారికి సౌకర్యంగా ఉండే విధంగా 2 కోట్ల రూపాయలతో రోడ్డు నిర్మాణం పనులు, విద్యుత్ లైన్ పనులు పూర్తి చేసుకున్నామని మంత్రి తెలిపారు. నాణ్యతలో ఎటువంటి లోపం లేకుండా రోడ్డు నిర్మాణ పనులు జరగాలని, దీనిని అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని, ఒకసారి రోడ్డు వేస్తే 15 సంవత్సరాల వరకు ఎటువంటి సమస్య రావద్దని మంత్రి సూచించారు.

మంథని పట్టణంలో కోటి రూపాయలు ఖర్చు చేస్తూ అన్ని హంగులతో ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేపడతామని, వీటిలో ఒక చిన్న గ్రంథాలయం స్టడీ సర్కిల్ ఏర్పాటుకు కూడా చర్యలు తీసుకుంటావని అన్నారు.

మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పించామని, 500 రూపాయల గ్యాస్ సిలిండర్ సరఫరా, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరా, సన్న బియ్యం సరఫరా. వంటి కార్యక్రమాలను అమలు చేస్తున్నామని అన్నారు.

యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేస్తున్నామని అన్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసామని, 15 రోజులలో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ చేపడతామని మంత్రి తెలిపారు. ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 200 కోట్లతో ఇండియా గురుకులాల నిర్మాణం చేపట్టామని అన్నారు.

సోమన్ పల్లి వద్ద 200 కోట్లతో చేపట్టిన యంగ్ ఇండియా గురుకుల పాఠశాల పనులు జరుగుతున్నాయని మంత్రి తెలిపారు. గత ప్రభుత్వంలో రైతులు తాలు కట్టింగ్ తో ఇబ్బందులు పడితే మన ప్రజా ప్రభుత్వం కట్టింగ్ కు స్వస్తి పలికి సన్న రకం వడ్లకు క్వింటాళ్ల 500 రూపాయల బోనస్ అందించామని అన్నారు.

25 లక్షల 65 వేల మంది రైతులకు 20 వేల 681 కోట్ల రూపాయల 2 లక్షల వరకు రుణమాఫీ పూర్తి చేసామని అన్నారు. వానాకాలం పంటలో సన్న రకం పండించిన ధాన్యానికి 1800 కోట్ల బోనస్ అందించామని అన్నారు. రాజీవ్ యువ వికాసం పథకం కింద స్వయం ఉపాధి యూనిట్ల ఏర్పాటుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున సబ్సిడీ విడుదల చేస్తుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో సంబంధిత ఆర్ అండ్ బి ఎస్. ఇ. కిషన్ రావు,ఈ ఈ భావ్ సింగ్ , ఆర్డీవో సురేష్, ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *