# Tags

ఆటో స్టార్టర్లు తొలగించుకొని నీరు, విద్యుత్ వృథా అరికట్టండి : మెట్ పల్లి ఏడీఈ దురిశెట్టి మనోహర్

మెట్ పల్లి :

వేసవి ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పెరుగుతున్న దృష్ట్యా, భూగర్భ జలమట్టాలు శీఘ్రంగా పడిపోతున్నాయని, విద్యుత్ వాడకం అనూహ్యంగా పెరుగుతునందున రైతులు నీటిని పంటలకు అవసరం ఉన్నంత మేరకే వాడుకోవాలని ఆటో స్టార్టర్లతో వృథా చేయొద్దని మెట్ పల్లి ఏడీఈ దురిశెట్టి మనోహర్ రైతులకు విజ్ఞప్తి చేశారు.

గురువారం ఈ మేరకు ఏడీఈ దురిశెట్టి మనోహర్ మాట్లాడుతూ….మరో రెండు వారాల్లో వరి పంట కోత దశకు చేరుకోనుందని ఎవరైనా రైతులు ఆటో స్టార్టర్లను వినియోగించి అవసరానికి మించి నీటిని తోడడం వలన నీరు వృధాగా కాలువల్లో, వాగుల్లో పడిపోవడం వల్ల అనవసరంగా నీటితో పాటు విద్యుత్ వృధా అవుతుందని భూగర్భ జలమట్టాలు కూడా అడుగంటి పోయే అవకాశం ఉందని ఆయన తెలిపారు.

ఈ ప్రక్రియతో అవసరం ఉన్న రైతులకు నీరు అందకుండా పోతుందని, వారి పంటల పట్ల కూడా సామాజిక బాధ్యత వహించాలని రైతులకు మనవి చేశారు. ఏ ఒక్కరూ ఆటో స్టార్టర్ వినియోగించవద్దని విజ్ఞప్తి చేశారు. మెట్టుపల్లి, మల్లాపూర్ సబ్ డివిజన్ పరిధిలో 32 వేల వ్యవసాయ విద్యుత్ పంపుసెట్లు నడుస్తున్నాయని వాటికి నిరంతర ఉచిత విద్యుత్తు ప్రతిరోజు 11.22 లక్షల యూనిట్లు సరఫరా జరుగుతుందని తెలిపారు.

28 సబ్స్టేషన్ లు,122 11కెవి ఫీడర్లు, 5 వేల డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ ల ద్వారా నాణ్యమైన విద్యుత్ అందించేందుకు సిబ్బంది వినియోగదారులకు అందుబాటులో ఉండి కృషి చేస్తున్నారని అన్నారు. ఏదైనా సరఫరాలో లోపం తలెత్తితే 1912 కు కాల్ చేయాలని సూచించారు.

రైతులు పంటలు పూర్తిస్థాయిలో చేతికి అందేంతవరకు అప్రమత్తంగా ఉండాలని నీటిని, విద్యుత్ ను వృధా చేయకుండా పొదుపుగా వాడుకొని సహకరించాలని, భవిష్యత్ తరాలకు ప్రకృతి వనరులు అందేలా చూడాలని
మెట్ పల్లి ఏడీఈ దురిశెట్టి మనోహర్ రైతులకు విజ్ఞప్తి చేశారు.