# Tags

రానున్న గోదావరి పుష్కరాల ప్రణాళికపై ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీమతి శైలజా రామయ్యర్ సమీక్ష

జగిత్యాల: ధర్మపురి

ధర్మపురి పట్టణానికి మాస్టర్ ప్లాన్ :

రానున్న గోదావరి పుష్కరాల ప్రణాళికపై, ప్రాథమిక సమీక్ష

ఆగమ, వాస్తు శాస్త్రం ప్రకారం శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం పునః నిర్మాణం

•ధర్మపురిలో పలు ప్రాంతాలను పరిశీలించిన దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీమతి శైలజా రామయ్యర్

2027 జూలై లో రానున్న గోదావరి పుష్కరాలను దక్షిణ భారత కుంభమేళాగా ఘనంగా నిర్వహించేందుకు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ అధికారులను ఆదేశించారు.

ధర్మపురిలోని గోదావరి తీరం వెంట ఉన్న ప్రధాన ఆలయాల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యతనిచ్చి మాస్టర్ ప్లాన్ రూపొందిచాలని ఆదేశించారు.
ధర్మపురిలోని శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం పునః నిర్మాణం పై సంక్షేమ శాఖ మంత్రి, జిల్లా కలెక్టర్ లతో చర్చించారు.

అదే క్రమంలో పుష్కరాల ఏర్పాట్లు, రాబోయే భక్తుల రద్దీని అంచనా వేసుకొని మౌలిక వసతులు కల్పించాలని సూచించారు.

పుష్కర స్నానాలు ఆచరించేందుకు వచ్చే లక్షలాది భక్తులకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా తగు సదుపాయాలు కల్పించేందుకు ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు.

2027లో జులై 23వ తేదీ నుంచి ప్రారంభం కానున్న గోదావరి పుష్కరాలకు వ్యవధి ఉన్నందున శాశ్వతమైన మౌలిక వసతులు, అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి ఆదేశించారు.

జిల్లాలో ప్రవేశించే గోదావరి నది తీరం వెంట ప్రాంతాల్లో పుష్కర ఘాట్లను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంటుందని అధికారులకు మంత్రి వివరించారు. పుష్కర స్నానాలకు వీలుగా ఉండే గోదావరి తీర ప్రాంతాలను అభివృద్ధి చేయాలని చెప్పారు.

ఒకే రోజు రెండు లక్షల మంది భక్తులు పుష్కర ఘాట్లకు తరలివచ్చినా ఇబ్బంది లేకుండా రోడ్లు, రహదారుల నిర్మాణంతో పాటు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా వాహనాల పార్కింగ్, తాగు నీరు, స్నానాల ఘాట్లతో పాటు భక్తులకు అవసరమైన వసతి సదుపాయాలన్నీ ఉండేలా ప్లాన్ చేయాలని తెలిపారు.

ఏర్పాట్లకు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సూచించారు. స్వచ్ఛ భారత్, జల్ జీవన్ మిషన్‌తో పాటు అందుబాటులో ఉన్న కేంద్ర పథకాలన్నింటితో సమన్వయం ఉండే పనులు గుర్తించి, వాటికి అవసరమైన అనుమతులు తీసుకోవాలని ఆదేశించారు.

జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ….

జిల్లాలో పుష్కరాలకు వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని పనుల జాబితాను సిద్ధం చేయాలని తెలిపారు. జిల్లాలో ప్రవేశించే గోదావరి నది తీరం వెంట ప్రాంతాల్లో పుష్కర ఘాట్లను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంటుందని కలెక్టర్ వివరించారు.

పుష్కరాల నిర్వహణకు ముందస్తు ఏర్పాట్లలో వైద్య ఆరోగ్య శాఖ,పర్యాటక, పోలీసు శాఖ,నీటి పారుదల, దేవాదాయ శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.

అనంతరం మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రిన్సిపల్ సెక్రటరీ, జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ ఆర్డీవో, సంబంధిత అధికారులతో పలు పుష్కర ప్రాంతాలను, కోనేరు, ఆలయ పరిసరాలను, కోటిలింగాల పుష్కర ఘాట్లను, పరిశీలించారు.

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ బి. ఎస్ లత, ఆర్డీవో మధుసూదన్, ధర్మపురి ఆలయ ఈవో శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.