# Tags

పేద విద్యార్థులకు మెరుగైన విద్య అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం : ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్


(రాజన్న సిరిసిల్ల :

పేద విద్యార్థులకు మెరుగైన విద్య, అందించడమే ప్రజా ప్రభుత్వ ప్రాధాన్యతా లక్ష్యంగా పని చేస్తున్నామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు.

మంగళవారం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ తో కలిసి వేములవాడ అర్బన్ మండలంలోని అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో పిఎం ఉషా పధకం క్రింద 9 కోట్ల 20 లక్షల నిధులతో మహిళా వసతి గృహము హాస్టల్ భవనం నిర్మాణం కి శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ, శాసనసభ్యుడిగా ఎన్నికైన తర్వాత తొలిసారి అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాల పర్యటించిన సందర్భంగా బాలికలు హాస్టల్ వసతి లేక పడుతున్న ఇబ్బందులను గమనించి సీఎం దృష్టికి తీసుకుని వెళ్ళానని అన్నారు.

విద్య పట్ల ప్రభుత్వానికి ఉన్న ప్రాముఖ్యత, పేదలు చదువుకునే పాఠశాలలు ,కళాశాలలు , రెసిడెన్షియల్ విద్యా సంస్థల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత కల్పిస్తూ పనిచేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం హాస్టల్ నిర్మాణానికి 10 కోట్లు మంజూరు చేసిందని అన్నారు.


2005 సంవత్సరంలో అగ్రహారం డిగ్రీ కళాశాలలో సైన్స్ వింగ్ ఏర్పాటు కోసం అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి సహకారంతో ఏర్పాటు చేశామని ఆయన గుర్తు చేశారు. హాస్టల్ వసతి కారణంగా ఎక్కువమంది బాలికలు ఉన్నత చదువులు చదువుకుంటారని ప్రభుత్వ విప్ పేర్కొన్నారు.

రెసిడెన్షియల్ విద్యార్థులు చదువుకునే పేద పిల్లల కోసం ప్రజా ప్రభుత్వం 40 శాతం డైట్ చార్జీలు, 200 శాతం కాస్మోటిక్ చార్జీల పెంచామని అన్నారు. పేద పిల్లలకు నాణ్యమైన భోజనం అందించాలని లక్ష్యంతో కామన్ డైట్ మేన్యూ ప్రవేశ పెట్టామని అన్నారు.

నూతనంగా 11 వేల టీచర్ పోస్టులను డీఎస్సీ ద్వారా భర్తీ చేసి ప్రభుత్వ పాఠశాలలో నియమించామని అన్నారు.
ఉపాధ్యాయులకు సంబంధించిన బదిలీలు పదోన్నతులు పారదర్శకంగా చేశామని అన్నారు. విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకుని వస్తున్నామని, ఐటిఐ కళాశాలను రతన్ టాటా కంపెనీతో అనుసంధానం చేసుకొని అడ్వాన్స్ ట్రేడ్ సెంటర్లుగా మారుస్తున్నామని అన్నారు.

200 కోట్ల రూపాయలను ఖర్చు చేసి 20 నుంచి 25 ఎకరాల స్థలంలో యంగ్ ఇండియా సమీకృత గురుకుల నిర్మాణ పనులు ప్రభుత్వం చేపట్టిందని అన్నారు. మేడిపల్లి మండలంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలను మంజూరు చేసుకున్నమని అన్నారు.

వేదాలకు సంబంధించిన ఆల్ ఇండియా పరీక్షలు వేములవాడ రాజన్న ఆలయంలో జరగాయని అన్నారు. భవిష్యత్తులో మరిన్ని విద్యాసంస్థలను వేములవాడ ప్రాంతంలో ఏర్పాటు చేసేందుకు పూర్తి స్థాయిలో కృషి చేస్తామని తెలిపారు.

జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ మాట్లాడుతూ, నాగ పంచమి రోజు పీఎం ఉష పథకం క్రింద 9 కోట్ల 20 లక్షల రూపాయలతో అగ్రహారం లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద బాలికల వద్ద గృహ నిర్మాణం పనులకు శంకుస్థాపన చేయడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. 18 నెలల కాలంలో ఈ భవన నిర్మాణ పనులు పూర్తి చేసి విద్యార్థినులకు అందుబాటులో ఉంచుతామని కలెక్టర్ పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు స్థానిక నాయకులు సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.