# Tags
#తెలంగాణ

జిల్లాలో ప్రశాంతంగా గ్రామ పంచాయతీ ఎన్నికలు, పోలింగ్ ప్రక్రియను పరిశీలిస్తున్న కలెక్టర్, ఎన్నికల అధికారి సత్యప్రసాద్

జగిత్యాల జిల్లా:

జిల్లాలో ప్రశాంతంగా గ్రామ పంచాయతీ ఎన్నికలు కొనసాగుతున్నాయి.

ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా, 1000 మంది పోలీసు బందోబస్తుతో గ్రామపంచాయతీ ఎన్నికలను అధికార యంత్రాంగం సజావుగా నిర్వహిస్తుందని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ వెల్లడించారు.

మొదటి విడతగా గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా జగిత్యాల జిల్లాలోని 7 మండలాల్లో జరుగుతున్న పోలింగ్ ప్రక్రియను జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి సత్య ప్రసాద్ ఉదయం 7 గంటల నుంచి పలు పోలింగ్ కేంద్రాలకు వెళ్లి పరిస్థితులను పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… జిల్లాలో మొదటి విడతగా 7 మండలాలు భీమారం, ఇబ్రహీంపట్నం, కథలాపూర్, కోరుట్ల, మల్లాపూర్, మేడిపల్లి, మెట్పల్లి మండలాల్లో పోలింగ్ జరుగుతుందని వివరించారు. 

ఒక లక్ష 2 వేల 238 మంది పురుష ఓటర్లు, 1లక్ష,15 వేల 955 మంది మహిళా ఓటర్లు ఉండగా, 1 ఇతర ఓటరు మొత్తం కలిపి 2 లక్షల 18 వేల 194 మంది ఓటర్లు తమ ఓటు హక్కును గురువారం అంటే ఈరోజు మధ్యాహ్నం ఒంటిగంటలోపు వినియోగించుకొనున్నారని వివరించారు.

 అలాగే మధ్యాహ్నం రెండు గంటల నుండి కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుందని ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయని వివరించారు.

 కాగా ఉదయం 9 గంటల వరకు 16.67% పోలింగ్ నమోదయిందని కలెక్టర్ ఈ సందర్భంగా వివరించారు. అలాగే పోలింగ్ కేంద్రాలకు వెళ్లే వృద్ధులకు గాని, వికలాంగుల కోసం గాని అవసరమైన సౌకర్యాలు ఏర్పాటు చేయడంతో పాటు అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద వైద్య సదుపాయం, ఓటర్లకు హెల్ప్ లైన్ తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించి ఎన్నికలు సజావుగా సాగేందుకు పోలింగ్ ప్రక్రియలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నామని కలెక్టర్, ఎన్నికల అధికారి వివరించారు.