# Tags

సుప్రీంకోర్టు ఆదేశాలను స్వాగతిస్తున్నా-గట్టు వామన్ రావు కేసులో అసలు దోషులకు శిక్ష పడాలి: రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

హైదరాబాద్ :

గట్టు వామన్ రావు కేసులో అసలు దోషులకు శిక్ష పడాలి

సిబీఐ విచారణలో అప్పటి ప్రభుత్వ పెద్దల పాత్ర బయటపడాలి

రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

గట్టు వామన్ రావు దంపతుల హత్య కేసు విచారణను సీబీఐకి అప్పగించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్వాగతించారు.

ఇది న్యాయ వ్యవస్థపై ప్రతి ఒక్కరికీ నమ్మకం కలిగించిందని మంగళవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపారు.

ఈ కేసులో అసలు దోషులు, వారికి సహకరించిన అప్పటి ప్రభుత్వ పెద్దలకు శిక్ష పడితేనే ఆ కుటుంబానికి న్యాయం జరుగుతుందన్నారు.

మంథనిలో నడిరోడ్డుపై అడ్వకేట్ వామన్ రావు దంపతులు హత్యకు గురైతే అప్పటీ బీఆర్ఎస్ ప్రభుత్వం కనీసం పట్టించుకోలేదని విమర్శించారు. నిష్పక్షపాతంగా విచారణ చేయకుండా అసలు దోషులను కాపాడిందన్నారు.

కుమారుడు, కోడలిని కోల్పోయిన ఆ వృద్ధ తల్లిదండ్రులకు న్యాయం చేయాల్సిన అప్పటి ప్రభుత్వ పెద్దలు.. విచారణను తప్పుదోవ పట్టించి అసలు హంతకులను కాపాడారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని ప్రజా సంఘాలు, కాంగ్రెస్ పార్టీ కోరినా పట్టించుకోలేదని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో కీలకమైన న్యాయ వ్యవస్థపై తనకు పూర్తి విశ్వాసం ఉందన్నారు. చివరకూ… న్యాయమే గెలుస్తుందన్నారు.